స్పీకర్ ను కలసిన కెటిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ బృందం
బిఆర్ ఎస్ నుంచి ఎమ్మల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరింది బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం.. మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకత్వంలోని ఎమ్మల్యేల బృందం నేడు స్పీకర్ ను ఆయన కార్యాలయంలో కలిసింది. ఈ సందర్బంగా నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు కెటిర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన వివరాలతో కూడిన లేఖను అందజేశారు.అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సభాపతి దృష్టికి తెచ్చామన్నారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్నారు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పును సభాపతికి గుర్తు చేశామన్నారు. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును స్పీకర్కు చదివి వినిపించా అని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యాయ్ పత్ర అంటూ మేనిఫెస్టో విడుదల చేసిందని అందులో స్పష్టంగా ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే ఇదే హస్తం పార్టీ కొట్లాడుతోందని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ రూ.50 కోట్లకు కొంటుందని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.గోవాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ ఇచ్చే సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారితో పార్టీ మారబోమని ప్రమాణం చేయించారని గుర్తు చేశారు. హిమాచల్ రాజ్యసభ ఎన్నికలు, మహారాష్ట్ర పరిణామాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ఘటనలన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు వెంటనే రద్దు చేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.
శ్రీశైలంలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి …
నేటి నుంచి శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ జెన్కో.. ఇక, దిగువన ఉన్న నాగార్జున సాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని కోరారు సాగర్ అధికారులు. దీంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు సాగర్ కి 3 టీఎంసీల నీటిని విడుదల చేసే క్రమంలో విద్యుత్ ఉత్పత్తని ప్రారంభించారు. మొత్తంగా శ్రీశైలం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. 15,919 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు అధికారులు..అయితే .. శ్రీశైలం డ్యామ్కు ఇన్ ఫ్లో నిల్గా ఉంది.. విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో ఔట్ ఫ్లో 15,919 క్యూసెక్కులుగా ఉంది.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 812.80 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 35.9850 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరింతస్థాయిలో నీటిమట్టం చేరితో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం అవుతున్నారు తెలంగాణ అధికారులు.
..